Supreme Court | ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఐటీ (సవరణ) చట్టం కింద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నిబంధనలను అమలు చేయడానికి కేంద్రం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఐటీ సవరణ చట్టం 2023 నిబంధనలను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఈ పిటిషన్లపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. అయితే, బాంబే హైకోర్టు ముందుకు వచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వదంతులు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా వాటిని అరికట్టేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పరిధిలో ఓ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీన్ని సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటును అడ్డుకోవాలని కోరారు. ఐటీ సవరణ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పిటిషనర్లు వాదించారు. మీడియా స్వేచ్ఛకు విరుద్ధమని.. వార్తలను నిర్ణయించే అధికారం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుందని ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది.
బాంబే హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ జీఎస్ పటేల్, జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ చందూర్కర్ ధర్మాసనం ధర్మాసనం ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను నిషేధించడంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. యూనిట్ ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రస్తుతం కేసు ఇంకా విచారణలో ఉండగా.. పిటిషన్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి.. హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టింది.