న్యూఢిల్లీ: పంజాబ్లో ప్రధాని మోదీ కాన్వాయ్కు భద్రతా వైఫల్యం ఏర్పడిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ మణిందర్ సింగ్ కోర్టులో వాదించారు. ప్రధాని భద్రతా వైఫల్యం కేవలం శాంతి భద్రతల సమస్య కాదు అని, అది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్ చట్టం కిందకు వస్తుందన్నారు. ఎస్పీజీ చట్టం ప్రకారం ఇది రాష్ట్ర పరిధిలో అంశం కాదని మణిందర్ తెలిపారు. ప్రధాని భద్రతా అంశం జాతీయ భద్రతకు సంబంధించినదని, ఇది పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, ఈ అంశాన్ని ప్రొఫెషనల్గా దర్యాప్తు చేపట్టాలని అడ్వకేట్ మణిందర్ కోర్టుకు చెప్పారు.
ప్రధానికి భద్రత కల్పించకపోవడం అత్యంత అరుదైన అంశమని, ఇది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చిందని, ప్రధాని భద్రతకు పెను ముప్పు ఉన్నట్లు తేలిందని కేంద్రం తన వాదన వినిపించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పంజాబ్ హోం మంత్రిని కూడా ఈ అంశంలో విచారించాలని, దర్యాప్తు ప్యానెల్లో ఆయన సభ్యుడిగా ఉండలేరని కోర్టుకు కేంద్రం తెలిపింది. ప్రధాని భద్రతా వైఫలం అంశాన్ని లైట్గా తీసుకోవడం లేదని, దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశామని, కేంద్రం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, విచారణ కోసం ఎవరినైనా నియమించవచ్చు అని కోర్టులో పంజాబ్ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.
ప్రధాని కాన్వాయ్ రోడ్డుపై వెళ్తుంటే, ఆ రాష్ట్ర డీజీపీని సంప్రదిస్తారని, రోడ్డు క్లియర్గా ఉన్నట్లు డీజీపీ చెబితేనే, ఆ తర్వాత కాన్వాయ్ కదులుతుందని తుషార్ కోర్టుకు చెప్పారు. అయితే రోడ్డు పై ఆందోళనకారులు అడ్డుకుంటారన్న హెచ్చరికలను ఇంచార్జ్ డీజీ చేయలేదని ఆయన కోర్టుకు చెప్పారు. పీఎం కాన్వాయ్కు ముందు వార్నింగ్ కారు వెళ్తుందని, ఆ సమయంలో స్థానిక పోలీసులు ఆందోళనకారులతో టీ తాగుతున్నారని, అయితే వాళ్లు ధర్నా గురించి ఎటువంటి హెచ్చరికలు చేయలేదన్నారు.
ప్రధాని పంజాబ్ పర్యటనకు చెందిన ట్రావెల్ రికార్డును సేకరించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీం ఆదేశించింది. కమిటీ అయినా లేక కమిషన్ అయినా.. ప్రధానికి జరిగిన భద్రతా వైఫల్యం ఏంటో నిర్ధారణ జరగాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పీఎం ట్రావెల్ రికార్డులను భద్రపరచాలన్నారు. విచారణ కోసం పంజాబ్ ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేస్తే, మరి కేంద్రం ఏర్పాటు చేసే కమిషన్ మాట ఏంటని ఆయన ప్రశ్నించారు. కమిటీ అయినా కమీషన్ అయినా.. సమస్యను తేల్చాలని సీజే అన్నారు. ఎస్పీజీ ఐజీ నేతృత్వంలోని కమిటీ కేవలం అడ్మినిస్ట్రేటివ్ అంశాలను మాత్రమే దర్యాప్తు చేస్తుందని ఎస్జీ మెహతా తెలిపారు.
ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు ఏర్పాటు చేసే కమిటీలో ఎన్ఐఏ అధికారితో పాటు చండీఘడ్ డీజీపీ ఉండవచ్చు అని సీజే తెలిపారు.