న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత పరిశీలించేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. ప్రస్తుతం జమ్మూలో డీలిమిటేషన్పై కసరత్తు జరుగుతున్న దృష్ట్యా పిటిషన్పై తక్షణ విచారణ అవసరమంటూ ఓ పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనలను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ‘ఇది ఆర్టికల్ 370కి సంబంధించిన విషయం. డీలిమిటేషన్ సైతం జరుగుతోంది’ అని న్యాయవాది
ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే, ఇది ఐదుగురు న్యాయమూర్తుల వ్యవహారమని, బెంచ్ను తాను తిరిగి ఏర్పాటు చేయాల్సి ఉందని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వేసవి సెలవుల తర్వాత పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ను ఏర్పాటు చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019ను కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ము, లడఖ్గా విభజించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటి సీజేఐ రంజన్ గోగోయ్ పదవీ విరమణ చేసిన తర్వాత సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లను పరిశీలిస్తున్నది.