America | హైదరాబాద్, జనవరి 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): అగ్రరాజ్యం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత డిసెంబర్ 29 నాటికి దేశ రుణాలు 34 ట్రిలియన్ డాలర్లకు (రూ. 2,832 లక్షల కోట్లు) చేరాయి. ఈ లెక్కన ఒక్కో అమెరికన్ నెత్తిపై లక్ష డాలర్లు (రూ. 83 లక్షలు) అప్పు ఉన్నట్టు తేలింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాజా నివేదికలో వెల్లడించింది. బడ్జెట్ లోటు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయినట్టు వివరించింది.
నిజానికి అమెరికా అప్పులు 2029 సంవత్సరానికి ఈ స్థాయికి చేరుకొంటాయని అంచనా వేశారు. అయితే 2019-20లో కరోనా సృష్టించిన సంక్షోభం, అనంతరం విధించిన లాక్డౌన్ కారణంగా వర్తక, వాణిజ్య సముదాయాలు మూతబడి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కొవిడ్ కల్లోలం ముగియగానే ముసురుకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు.. వెరసి అమెరికాను అప్పుల కుప్పగా మార్చాయి.
ప్రభావమైతే ఉండకపోవచ్చు
సర్కారు పాలసీలకు అనుగుణంగా ప్రభుత్వానికి అప్పునిచ్చే సంస్థలు ఉన్నాయని, దీంతో ఈ అప్పుల భారం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు అంతగా ప్రభావం చూపకపోవచ్చునని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రజలపై పన్నుల భారం మోపకుండానే సామాజిక సంక్షేమం, వైద్య కార్యక్రమాలను కొనసాగించడానికి ప్రభుత్వానికి వెసులుబాటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రుణాల అంశం కీలక భూమిక పోషించబోతుండటంతో.. సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు విధించి అప్పుల నుంచి బయటపడాలని బైడెన్ ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా పన్నుల వసూళ్లలో కీలకమైన ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు బడ్జెట్ కేటాయింపులను పెంచింది. అయితే, రక్షణేతర రంగాలకు బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం ద్వారా రుణభారాన్ని తగ్గించుకోవాలని రిపబ్లికన్ చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు. ప్రజలపై పన్నుభారాన్ని మోపవద్దని, ఐఆర్ఎస్ కేటాయింపులను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా..