రాయ్పూర్: వివాహిత మహిళల కోసం ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ప్రభుత్వ పథకంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్ (Sunny Leone) ప్రతి నెల రూ.1000 అందుకున్నారు. ఆమె అకౌంట్లోకి నేరుగా నగదు జమ అవుతున్నది. ఇప్పుడీ విషయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతున్నది. పథకం నిధులు దారిమళ్లుతున్నాయని, అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతున్నదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా సాధికారత కోసం మహతారి వందన్ యోజన పేరుతో వారి ఖాతాల్లోకి నెలకు రూ.వెయ్యి బదిలీ చేస్తున్నది. ఈ క్రమంలో వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్ పేరుతో అకౌంట్ తెరచినట్లు గుర్తించారు. బస్తర్ రీజియన్లోని తూలూర్ చిరునామాతో బ్యాంక్ ఖాతా ఉన్నదని, ఆమె భర్త పేరు జానీ సిన్స్గా పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. గత మార్చి నుంచి ప్రతి నెల రూ.1000 చొప్పున ఆ ఖాతాలో డిపాజిట్ అవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ అకౌంట్ను సీజ్ చేయాలని బస్తర్ జిల్లా కలెక్టర్ హారిస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిందితుని నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని స్పష్టం చేశారు.