న్యూఢిల్లీ: 17వ లోక్సభ(17th Lok Sabha) సమావేశాలు ఫిబ్రవరి 10వ తేదీన నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాల కాలంలో 9 మంది ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పలేదట. ఆ ఎంపీల్లో ఫిల్మ్ స్టార్స్ సన్నీ డియోల్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు. ఎంపీ సన్నీ డియోల్ తొలిసారి గురుదాస్పూర్ నుంచి ఎన్నికయ్యారు. అయితే గత అయిదేళ్లలో ఆయన కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఇక శత్రుఘ్న సిన్హా మాత్రం ఆ పనికూడా చేయలేదట.
17వ లోక్సభకు చెందిన తొలి సెషన్ జూన్ 17, 2019లో ప్రారంభమైన విషయం తెలిసిందే. లోక్సభ రికార్డుల ప్రకారం మొత్తం 543 ఎంపీలు ఉన్నారు. దాంట్లో అయిదేళ్లలో ఎటువంటి చర్చలో పాల్గోనివారి సంఖ్య తొమ్మిదిగా ఉంది. ఇందులో ఆరుగురు బీజేపీ ఎంపీలుఉన్నారు. ఇద్దరు టీఎంసీ, ఒకరు బీఎస్పీ ఎంపీ.
యావత్ లోక్సభ సమావేశాల్లో ఏమాత్రం నోరు విప్పనివారిలో రమేశ్ చందప్ప జిగజినాడి, బీఎస్పీ ఎంపీ అతుల్ కుమార్ సింగ్, టీఎంసీ ఎంపీ దిబ్యేందు అధికారి, బీజేపీ ఎంపీ బీఎన్ బచేగౌడ, బీజేపీ ఎంపీ ప్రధాన్ బారువా, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే, బీజేపీ ఎంపీ వీ శ్రీనివాస్ ప్రసాద్, టీఎంసీ శత్రుఘ్న సిన్హా ఉన్నారు.
శత్రుఘ్న సిన్హా.. ఏప్రిల్ 16, 2022లో జరిగిన లోక్సభ బైపోల్స్లో గెలుపొందారు. లోక్సభలో జరిగే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లో సన్నీ డియోల్ ఒక్కసారి కూడా పాల్గొనలేదు. సభలో మాట్లాడాలని స్పీకర్ బిర్లా రెండు సార్లు సన్నీ డియోల్ను కోరినట్లు తెలిసింది. కానీ ఆ నటుడు నోరు విప్పలేదు.