కేప్ కెనావెరల్: భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర చివరి నిమిషంలో ఆగిపోయింది. బోయింగ్ సంస్థ ‘స్టార్లైనర్’ వ్యోమనౌకలో సునీతాతోపాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లాల్సిన ‘అట్లాస్’ రాకెట్లో సోమవారం రాత్రి వాల్వ్కు సంబంధించిన సమస్య తలెత్తడమే ఇందుకు కారణం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉన్నది. దీనికి రెండు గంటల ముందు ‘అట్లాస్’ రాకెట్ ఎగువ దశలోని ఆక్సిజన్ ప్రెజర్-రిలీఫ్ వాల్వ్ పనితీరు సక్రమంగా లేదని గుర్తించడంతో ప్రస్తుతానికి ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్టు యునైటెడ్ లాంచ్ అలయెన్స్ కంపెనీ సీఈవో టోరీ బ్రునో వివరించారు.