Shashi Tharoor | తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయమై గతంలో పాటియాలా హౌస్ కోర్టు శశిథరూర్కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు శశిథరూర్కు నోటీసులు జారీ చేసింది.
2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, సునందది హత్య అన్న కోణంలో పోలీసులు తొలుత దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో ఆయన ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు… ఆయనపై నమోదైన అభియోగాలను 2021 ఆగస్టు 18న కొట్టివేసి, థరూర్కు క్లీన్ చిట్ ఇచ్చింది.
పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును 15 నెలల తర్వాత పోలీసులు ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు థరూర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.