Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి భారతి సంతతి నేత రిషి సునాక్. రికార్డుల హోరు సృష్టించారు. బ్రిటన్ ప్రధానులుగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించాక.. ఇటీవలి కాలంలో అధికార నివాసం ‘డౌనింగ్ స్ట్రీట్’ నుంచి సుదీర్ఘ ప్రసంగం చేసిన నేతగా రిషి సునాక్ నిలిచారు. బకింగ్హం ప్యాలెస్లో కింగ్ చార్లెస్-3 సమక్షంలో ప్రధానిగా ప్రమాణం చేసి.. డౌనింగ్ స్ట్రీట్- 10 కు వచ్చారు. అటుపై ఐదు నిమిషాల 56 సెకన్ల సేపు మాట్లాడారు.
ఇటీవలి కాలంలో బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేసిన వారెవ్వరూ డౌనింగ్స్ట్రీట్-10 నుంచి ఎక్కువ సేపు ప్రసంగించిన దాఖలాలు లేవని ఇండిపెండెంట్ దిన పత్రిక పేర్కొంది. లిజ్ ట్రస్ కంటే దాదాపు రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడారు. గత సెప్టెంబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ 4:04 నిమిషాలు ప్రసంగించారు.
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రసంగించిన వారిలో రిషి సునాక్ గురువు- మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక్కరే మినహాయింపు. 2019లో ప్రధానిగా నియమితులైనప్పుడు 11:13 నిమిషాల సేపు బోరిస్ జాన్సన్ మాట్లాడారు.
అంతకుముందు 2016లో థెరెస్సా మే 4:42 నిమిషాలు, డేవిడ్ కేమరూన్ 2010లో సరిగ్గా నాలుగు నిమిషాలు, గార్డన్ బ్రౌన్ 2007లో 2:49 నిమిషాలు, 1997లో టోనీ బ్లెయిర్ 5:17 నిమిషాలు, 1990లో జాన్ మేజర్ 2:49 నిమిషాలు మాట్లాడారని ఇండిపెండెంట్ వార్తాకథనం ప్రచురించింది.
రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రిషి సునాక్ దేశ ఆర్థిక వ్యవస్థను ముంచెత్తిన సంక్షోభాన్ని ఢీ కొట్టి పరిష్కారాలు కనుగొంటానని స్పష్టం చేశారు. సమగ్రత, ప్రొఫెషనలిజం, అకౌంటబిలిటీతో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.