Kangana Ranaut : రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పందించారు. కంగనా వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను తూలనాడటం తప్పని, వీరు దేశానికి ఆహారాన్ని సమకూర్చేందుకు ఏడాది పొడవునా శ్రమిస్తారని చెప్పారు.
ఈ తరహా వ్యాఖ్యలతో వారిని అవమానించే హక్కు ఏ ఒక్కరికీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. కాగా, రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని బీజేపీ నేత, మండి ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు.
సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వా్ర్ధప్రయోజనాలు ఆశించే వారు ప్రోత్సహించారని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి. పంజాబ్ సీనియర్ బీజేపీ నేత హర్జిత్ గరేవాల్ కంగనా రనౌత్ వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :