చండీగఢ్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను చర్చలకు ఆహ్వానించాలని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ మంగళవారం ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా చట్టాలను రద్దు చేసేందుకు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేస్తూ బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా వెంటనే ప్రధాని జోక్యం చేసుకొని నల్ల చట్టాలను రద్దు చేసేందుకు ముందస్తు షరతులు లేకుండా రైతులను చర్చలకు ఆహ్వానించాలన్నారు. దేశ ప్రజలంతా అన్నదాత వెంటే ఉన్నారని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది పార్లమెంట్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం, రైతుల సంఘాల మధ్య ఇప్పటి వరకు 11 రౌండ్ల పాటు చర్చలు జరగ్గా.. ఎటూ తేలకుండా ముగిసిన విషయం తెలిసిందే.