Sudha Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ పార్లమెంట్ హౌస్ లోని తన చాంబర్లో సుధామూర్తితో ప్రమాణం చేయించారు. నారాయణ మూర్తి సమక్షంలోనే ఎంపీగా సుధామూర్తి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్, రచయిత్రిగా సుధామూర్తి పిల్లల కోసం పలు పుస్తకాలు రచించారు. కన్నడ, ఇంగ్లిష్ సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గౌరవంగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. దీంతోపాటు సుధామూర్తిని 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం గౌరవించింది. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.