న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 15,920 మంది భారతీయ విద్యార్థులను 76 విమానాల ద్వారా స్వదేశానికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గరిష్ఠంగా రొమేనియా నుంచి 6680 మంది విద్యార్థులను 31 విమానాల ద్వారా, హంగేరీ నుంచి 5,300 మందిని 26 విమానాల ద్వారా, పోలాండ్ నుంచి 2,822 మందిని 13 విమానాల ద్వారా, స్లోవేకియా నుంచి 1,118 మందిని 6 విమానాల ద్వారా తరలించినట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. అలాగే ఉదయం చేసిన మరో ట్వీట్లో రొమేనియా సహాయాన్ని ఆయన కొనియాడారు. భారతీయ విద్యార్థులను తమ పిల్లల మాదిరిగా చూసుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత భారతీయ విద్యార్థులను విమానాల ద్వారా తరలింపు కోసం ‘ఆపరేషన్ గంగా’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో పొరుగు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగేరీ, స్లోవేకియా ద్వారా భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను విమానాల ద్వారా తరలిస్తున్నారు. ఈ తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడం కోసం కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ ఉక్రెయిన్ పొరుగు దేశాలకు ఫిబ్రవరి 28న వెళ్లారు. జ్యోతిరాదిత్య సింధియాను రొమేనియాకు పంపారు.
#OperationGanga Update: We have successfully evacuated over 15920 students via 76 flights. Breakup –
Romania – 6680 (31 flights)
Poland – 2822 (13 flights)
Hungary – 5300 (26 flights)
Slovakia – 1118 (6 flights) @HardeepSPuri @KirenRijiju @Gen_VKSingh— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 6, 2022