పాట్నా: రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షా ఫలితాలపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. రైల్వే స్టేషన్లో బైఠాయించి పలు రైళ్లను నిలిపివేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పరీక్ష 2021 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సీబీటీ 2 పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయడానికి సీబీటీ 1 పరీక్షకు సంబంధించిన ఆర్ ఆర్ బీ ఎన్టీపీసీ రిజల్ట్స్ను ఈ నెల 15న విడుదల చేశారు.
అయితే ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితాలకు వ్యతిరేకంగా సోమవారం ఆకస్మికంగా పాట్నా రైల్వే స్టేషన్లో నిరసన చేపట్టారు. దాదాపు 5 గంటల పాటు రైల్వే స్టేషన్లోని రైలు పట్టాలపై బైఠాయించి పలు రైళ్లను నిలిపివేసారు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి నుంచి నుంచి బలవంతంగా తరలించారు.
మరోవైపు సమస్యకు ఇది పరిష్కార మార్గం కాదని పాట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు.
ప్రధాన నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో పాట్నా మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.