న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించటంపై దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటున్నది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, అరెస్టులతో బెదిరించినా వెనక్కు తగ్గేదే లేదని అంటూ రోజుకో చోట డాక్యుమెంటరీని ప్రదర్శిస్తూనే ఉన్నారు. విద్యార్థులకు కొన్నిచోట్ల విపక్ష రాజకీయ పార్టీలు కూడా జత కలుస్తుండటంతో డాక్యుమెంటరీని ప్రజలంతా చూసేలా బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో నాటి దారుణాలకు మోదీపై ఇందులో వేలెత్తి చూపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, దేశంలో ఆ డాక్యుమెంటరీ ఎక్కడా ప్రసారం కాకుండా నిషేధించిన విషయం తెలిసిందే. అయితే మోదీ సర్కారు దేశంలో భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తున్నదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ హక్కులను కాపాడుకొనేందుకు కచ్చితంగా డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని పలు విద్యార్థి సంఘాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. జామియా మిలియా యూనివర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించిన13 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని గురువారం వదిలేశారు. కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం బీబీసీ డాక్యుమెంటరీని విస్తృతంగా ప్రసారం చేస్తున్నది. స్థానిక బీచ్లలో పెద్దపెద్ద తెరలు ఏర్పాటుచేసి గురువారం ప్రదర్శించారు.
బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించటంపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. భారత్తోపాటు ప్రపంచంలో ఏ దేశంలో అయినా భావప్రకటనా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు.