న్యూఢిల్లీ, జనవరి 22: ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లకు కేంద్రం ఈసారి బడ్జెట్లో మూలధన తోడ్పాటును ప్రకటించకపోవచ్చని తెలుస్తున్నది. పీఎస్బీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల మూలధన సమృద్ధి నిష్పత్తి 14 నుంచి 20 శాతం మేరకు ఉన్నదని, రెగ్యులేటరీ అవసరాల కంటే అధికమని అంటున్నారు. మార్కెట్ నుంచి రుణాలను సేకరించడం, కీలకేతర ఆస్తులను అమ్మడం ద్వారా పీఎస్బీలు తమ వనరులను పెంపొందించుకొంటున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా బ్యాంకులకు మూలధన తోడ్పాటును అందించిన కేంద్ర ప్రభుత్వం.. పీఎస్బీల రీక్యాపిటలైజేషన్ కోసం అనుబంధ డిమాండ్ల ద్వారా రూ.20 వేల కోట్లు కేటాయించింది.