ముంబై : కరోనా మహమ్మారి మొదటి, సెకండ్ వేవ్లో మహారాష్ట్రపై విరుచుకుపడింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం దేశంలో మహారాష్ట్రలోనే ప్రభావం చూపుతున్నది. ఇప్పటి వరకు 50కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుందన్న ఆందోళన మధ్య బీఎంసీ రాబోయే క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ జారీ చేసింది. అలాగే పార్టీలకు దూరంగా ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది.
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ సందర్భంగా ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ మాట్లాడుతూ బీఎంసీ, ముంబై పోలీసులు జారీ చేసిన కొవిడ్ ప్రోటోకాల్స్ను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేడుకలపై నిషేధం విధించే ఆలోచన లేదన్నారు. ప్రజలంతా తప్పక నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇందులో 54 మహారాష్ట్రలోనే ఉన్నాయి. వీటిలో 22 ముంబై మహానగరంలోనే రికార్డయ్యాయి.
బీఎంసీ కమిషనర్ చాహల్ ఆదివారం మాట్లాడుతూ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో చాలా దేశాల్లో పరిస్థితి అదుపు తప్పిందని, మరోసారి లాక్డౌన్ పరిస్థితి తలెత్తిందన్నారు. మూడో వేవ్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా చాలా చోట్ల వివాహ వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో మార్గదర్శకాలు సరిగ్గా పాటించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు బీఎంసీ బాడీ వార్డుస్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. అలాగే పోలీస్ అధికారులు సైతం నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని కమిషనర్ వివరించారు.