Delhi Zoo : ఢిల్లీ జూలో వీధి కుక్కల దాడిలో అంతరించిపోయే దశలో ఉన్న మూడు జింకలు చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12వ తేదీ రాత్రి కొన్ని వీధికుక్కలు జూ లోకి చొరబడ్డాయి. అవి రెండు హగ్ జింకలు, ఒక సిక జింక మీద దాడి చేశాయి. ఈ సంఘటనలో ఆ మూడు జింకలు ప్రాణాలు కోల్పోయాయి. జూ ప్రహరీ ఎత్తు లేకపోవడం వల్లనే వీధి కుక్కలు సులువుగా లోపలికి ప్రవేశించాయని జూ అధికారులు తెలిపారు.
‘ఈ సంఘనటపై అంతర్గత విచారణకు ఆదేశించాం. అంతేకాదు ప్రహారీ గోడ ఎత్తు పెంచడం కోసం టెండర్లు కూడా ఆహ్వానించాం. నిజాముద్దీన్ రైల్వే పరిసరాల్లో ఉండే ప్రజలు జూ ప్రహరీ దగ్గర చెత్త పడేస్తున్నారు. దాంతో, చెత్త పేరుకుపోవడం వల్ల వీధి కుక్కలు సులువుగా జూలోకి వస్తున్నాయి. అందుకని ఆ ప్రాంతంలో చెత్తను వెంటనే తొలగించాలని, వీధి కుక్కల సమస్య పరిష్కరించాలని మునిసిపల్ అధికారులకు లెటర్ రాశాం’ అని ఢిల్లీ జూ డైరెక్టర్ ఆకాంశ మహాజన్ చెప్పాడు.
గోడ నిర్మాణ పనులు పూర్తి కావడానికి 2-3 నెలలు పడుతుందని, అప్పటివరకూ ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆకాంశ తెలిపాడు.