న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీని సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అసెంబ్లీలో ఫోర్త్ క్లాస్ రాజు అంటూ ఒక కథను చెప్పారు. ‘గౌరవనీయ అధ్యక్షా, ఈ రోజు సభకు నేను ఓ కథ వినిపించాలనుకుంటున్నాను. కథ పేరు నాలుగో తరగతి పాసైన రాజు. నా కథలో రాణి లేదు. రాజు మాత్రమే ఉన్నాడు. కథలోని రాజు నిరక్షరాస్యుడు. నాలుగో తరగతి పాసయ్యాడు. చాలా అహంకారంతో ఉండేవాడు. ధనం మీద చాలా ఆశ. ఇది వేల ఏండ్ల చరిత్రగల దేశం కథ. ఒక ఊరిలో ఓ పేద కుటుంబంలో ఓ పిల్లవాడు పుట్టాడు. ఆ బాలుడు పుట్టినప్పుడు జోస్యులు వచ్చి అమ్మా నీ కొడుకు పెద్దయ్యాక మహా సమ్రాట్ అవుతాడని జాతకం చెప్పారు. తల్లికి నమ్మశక్యం కాలేదు. నేను చాలా పేదరాలిని. నా కొడుకు చక్రవర్తి కావడం ఏమిటని అన్నది. కానీ గ్రహాల ప్రకారం నీ కొడుకు మహా చక్రవర్తి అవుతాడని జోస్యులు నొక్కిచెప్పారు.
పిల్లవాడు పెరిగి పెద్దవుతున్నాడు. ఊరి బడికి వెళ్లేవాడు. చదువు మీద పెద్దగా ధ్యాస పెట్టేవాడు కాదు. అటూఇటూ పెట్టి నాలుగో తరగతి వరకు చదివి బడి మానేశాడు. ఊరిదగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉండేది. ఇల్లు గడిచేందుకు ఆ పిల్లవాడు స్టేషన్ వద్ద చాయ్ అమ్మేవాడు. పిల్లలను పోగేసి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. జోస్యులు చెప్పినట్టుగానే ఆ పిల్లవాడు పెద్దయ్యాక రాజ్యానికి రాజయ్యాడు. ప్రజలు ఆయనను నాలుగోక్లాసు రాజు అని పిలిచేవారు. బాగా చదువుకున్న అధికారులు ఆయన వద్దకు వచ్చి ఇంగ్లిష్లో ఎడాపెడా మాట్లాడి కావాల్సిన పత్రాల మీద సంతకాలు చేయించుకుని వెళ్లేవారు. అధికారులను ఏమన్నా అండగాలంటే తనకు చదువు రాదని వారికి తెలిసిపోతుందని జంకేవాడు. తనకు చదువు లేదని బెంగ పట్టుకుంది. దాంతో ఎమ్మే చదివినట్టు ఓ నకిలీ డిగ్రీ తయారు చేసుకొన్నాడు.
జనం నమ్మలేదు. ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ డిగ్రీ అనుకొంటూ ఆర్టీఐ వేశారు. ఆర్టీఐ వేసినవాడి మీద పాతికవేల జరిమానా వేశారు. (కథ చెప్తూ బీజేపీ వాళ్లవైపు తిరిగి మీ నేత గురించి మాట్లాడటం లేదని చెప్పారు. మీరు కూడా నవ్వొచ్చని చురకలు అంటించారు) ఎవరు ఆర్టీఐ వేస్తే వారికి పాతికవేల జరిమానాలు వేస్తూ పోయారు. ఒకరోజు రాత్రి 8 గంటలకు నోట్ల రద్దు గురించి ప్రకటించారు. ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలు ఉపాధి కోల్పోయారు. దేశంలో ఎక్కడ చూసినా పెద్దపెద్ద క్యూలైన్లు కనిపించాయి. నోట్ల రద్దుతో ఉగ్రవాదం కూడా సమసిపోతుందని రాజపు అన్నాడు. ఉగ్రవాదం అంతం కాలేదు. అవినీతి మాయం కాలేదు. దేశం నాశనమైపోయింది. దేశం పదేండ్లు, పదిహేనేండ్లు, ఇరవయ్యేండ్లు వెనక్కి పోయింది. ఒకరోజు కొందరు రాజు వద్దకు వెళ్లి వ్యవసాయంపై కొన్ని చట్టాలను చేయాలని చెప్పారు. సంతకం పెట్టేశాడు. మూడు నల్లచట్టాలు వచ్చాయి. యావత్తు దేశంలోని రైతులు రోడ్డు మీదికి వచ్చారు.
750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు రాజు ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రాజుకు డబ్బు పోగేయాలని ఒక రోజు ఆలోచన వచ్చింది. ఓ స్నేహితుడిని పిలుచుకున్నాడు. నేను రాజును కదా సర్కారీ సంస్థలను, కంపెనీలను నీకు ఇప్పిస్తాను. సర్కారీ డబ్బును కూడా కట్టబెడతాను అని చెప్పాడు. పేరు నీది, కమీషన్ నాది. నీకు ఇందులో పదిశాతం కమీషన్ ఉంటుంది. మొత్తం ధనమంతా నాది అన్నాడు. మిత్రుడు ఒప్పేసుకున్నాడు. మొదట బ్యాంకులను కొల్లగొట్టారు. బోలెడు కేసులున్న ఓ అధికారిని పిలిచి నిన్ను చైర్మన్ను చేస్తున్నా.. నా స్నేహితుడికి పదివేల కోట్ల రుణం ఇవ్వు లేకపోతే జైలుకు వెళ్తావ్ అని బెదిరించాడు. దాంతో భయపడిపోయిన బ్యాంకు అధికారి దండం పెట్టి సరే అలాగే ఇస్తాను అన్నాడు. అలా నాలుగోక్లాసు రాజు, అతని మిత్రుడు బ్యాంకులకు రూ.రెండున్నర లక్షల కోట్లు ముంచేశారు. బ్యాంకులను దోచిన రాజు మిత్రుడు దేశాన్నే కొనేయడం మొదలుపెట్టాడు. విమానాశ్రయాలు, విద్యుత్తు కంపెనీలు కొన్నాడు. విద్యుత్తు రేట్లు పెంచాడు. ఓడరేవులు, బొగ్గుగనులు వశం చేసుకొంటున్నాడు. దేశంలో హాహాకారాలు మొదలయ్యాయి.
ధరలు ఆకాశాన్ని తాకాయి. రూ.400 ఉండే గ్యాస్ రూ.1,100కు, పెట్రోల్ రూ.71 నుంచి రూ.97కు పెరిగాయి. పెట్రో ధరలతో అన్ని రకాల వస్తువుల ధరలు భగ్గుమన్నాయి. దేశంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రజలు రాజుకు వ్యతిరేకంగా గొంతు విప్పడం మొదలుపెట్టారు. ఎవరో తన మీద కార్టూను వేస్తే రాజు అతడిని కూడా జైలులో పెట్టాడు. విమర్శలు చేసినందుకు మరొకరిని జైలులో పెట్టాడు. వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిని కూడా జైల్లో పెట్టాడు. జడ్జీలనూ వదల్లేదు. పాత్రికేయులను వదల్లేదు. మీడియాకు వదల్లేదు. ఎవరినీ వదలిపెట్టలేదు. నాలుగో క్లాసు రాజు ఆవిధంగా అందరినీ కటకటాల్లోకి తోస్తూపోయాడు. ఆ దేశంలోనే ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఓ ముఖ్యమంత్రి ఉండేవాడు. (చూశారా వారికీ నవ్వొస్తోంది అంటూ బీజేపీ సభ్యులవైపు చూపారు) వారి ముఖాల మీద కూడా నమ్మకం తొంగిచూస్తున్నది. ఆ ముఖ్యమంత్రి తన ప్రజల బాగోగులు ఎంతగానో పట్టించుకొనేవాడు. అతడు నిలువెత్తు నిజాయితీపరుడు. ఆ ముఖ్యమంత్రి నిజమైన దేశభక్తుడు. ఆయన బాగా చదువుకున్నవాడు. ప్రజలను ధరలభారం నుంచి విముక్తం చేసేందుకు ఉచిత విద్యుత్తు ఇచ్చాడు. దాంతో నాలుగో క్లాసు రాజుకు పిచ్చెక్కింది. ముఖ్యమంత్రిని పిలిచి నీకెంత ధైర్యం అని మండిపడ్డాడు. ఖబర్దార్ ఉచిత విద్యుత్తు ఇవ్వొద్దని తాఖీదిచ్చాడు.
ముఖ్యమంత్రి వినలేదు. ముఖ్యమంత్రి బడులు పెట్టి పిల్లలకు చదువులు చెప్పించాడు. ఇదీ రాజుకు నచ్చలేదు. ముఖ్యమంత్రి వైద్యం ఉచితం చేశాడు. ప్రజలకు రాజు ఎలాంటివాడన్న విషయం అర్థమైపోయింది. ఒకరోజు ప్రజలను రాజును గద్దెదించేశారు. ఒక నిజాయితీపరుడైన, దేశభక్తుడైన వ్యక్తిని గద్దెమీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత దేశంలో ధరలు తగ్గిపోయాయి. సమస్యలు తగ్గిపోయాయి. చిన్నప్పటి కథల మాదిరిగానే ఈ కథలో నీతి ఏమిటంటే మీ దేశంలో ధరల పెరుగుదల ఉంటే.. సమస్యలు ఉంటే.. అవకతవకలు జరుగుతుంటే.. మన రాజు చదువురానివాడు కాదు కదా అనేది రూఢీ చేసుకోవాలి. నిరుద్యోగం ఉందంటే రాజుకు ఎవరైనా మిత్రుడు ఉన్నాడా అన్నది తేల్చుకోండి. ఉంటే రాజును పీకిపారెయ్యండి. దిబ్బ రాజ్యం. దివాలాకోరు రాజు అనే సామెతలా ఉండొద్దు’ అని తెలిపారు. అటు.. ఢిల్లీ శాసనసభ మోదీ పనితీరును ఎండగట్టింది. ఆప్ ఆదరణ, కేజ్రీవాల్ ఎదుగుదలను చూడలేకే, దాని ప్రతిష్ఠను దిగజార్చడానికి మోదీ, బీజేపీ చాలా ఏండ్ల్లుగా ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ సభలో తీర్మానించారు.