లక్నో: మద్యం తాగడాన్ని అడ్డుకున్నందుకు భార్యపై భర్త ఆగ్రహించాడు. ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. (man burns wife alive) ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మునీష్ సక్సేనా అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో కూడా మద్యం సేవించసాగాడు. గమనించిన 40 ఏళ్ల భార్య షానో భర్త ఇంకా మద్యం తాగడాన్ని అడ్డుకున్నది. దీంతో ఆగ్రహించిన సక్సేనా బైక్ నుంచి పెట్రోల్ తీశాడు. భార్యపై పోసి ఆమెకు నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, మంటల్లో కాలుతున్న షానోను కాపాడేందుకు అత్త మున్నీ దేవి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేతులు కూడా కాలాయి. తల్లి షానో మంటల్లో సజీవ దహనం కావడం చూసి పిల్లలైన 8 ఏళ్ల సన్నీ, ఐదేళ్ల అర్జున్ ఆందోళన చెందారు. కేకలు వేసి పొరుగువారిని అలెర్ట్ చేశారు. దీంతో షోనో మంటలు ఆర్పడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సజీవంగా కాలిన షానో మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలైన అత్తను కూడా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న భర్త సక్సేనాను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.