లక్నో: బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. (Stones Thrown) దీంతో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్, ముజఫర్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆదివారం ఖతౌలీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాగా, కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు సుధీర్ సైనీ ఈ సంఘటనను ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో అదనపు పోలీసులను మోహరించారు. రాళ్లు రువ్వి వాహనాలు ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.