న్యూఢిల్లీ, మే 8: దక్షిణాదిలో కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ర్టాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. శనివారం నుంచి కేరళలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లోకి రాగా, తమిళనాడులోనూ సోమవారం నుంచి రెండు వారాలపాటు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. కర్ణాటకలో ఈ నెల 10-24 వరకు లాక్డౌన్ తరహా ఆంక్షలను విధించారు. వారాంతపు నిషేధాజ్ఞలు పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో కేరళ సీఎం పినరాయి విజయన్ సంపూర్ణ లాక్డౌన్వైపే మొగ్గుచూపారు. ఆ రాష్ట్రంలో శనివారం కొత్తగా 41వేలకుపైగా కేసులు నమోదుకాగా, 64 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 4.17 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. పుదుచ్చేరిలో ఇప్పటికే లాక్డౌన్ అమల్లో ఉన్నది. ఏపీలో 2 వారాలపాటు పాక్షిక లాక్డౌన్ ప్రకటించారు. తెలంగాణలో ఈ నెల 15 వరకు నైట్కర్ఫ్యూ పొడిగించారు. దేశంలోని 37.23 లక్షల యాక్టివ్ కేసుల్లో దాదాపు 80 శాతం 12 రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6.57 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.