న్యూఢిల్లీ, మే 27: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్డౌన్పై రాష్ర్టాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పలు రాష్ర్టాలు లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గుచూపుతుండగా, మరికొన్ని రాష్ర్టాలు ఆంక్షలను దశలవారీగా సడలిస్తున్నాయి.
కేసులు పెరుగుదల దృష్ట్యా లాక్డౌన్ను జూన్ 15వరకు పొడిగిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. బెంగాల్లో ఏప్రిల్ 30న విధించిన లాక్డౌన్ ఈ నెల 30తో అది ముగియనున్నది. లాక్డౌన్లో మాల్స్, మార్కెట్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవి మూసే ఉంటాయని అధికారులు తెలిపారు.
హర్యానాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జూన్ 1 నుంచి 9-12 తరగతులకు బడులు తెరువాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీచేసింది. బెంచ్కి ఒక విద్యార్థే కూర్చోవాలని సూచించింది. సామాజిక దూరం, మాస్క్ ధరించడం తదితర కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టంచేసింది.
పంజాబ్ ప్రభుత్వం కరోనా ఆంక్షలను జూన్ 10 వరకు పొడిగించింది. అయితే కొన్ని సడలింపులు ఇచ్చింది. దవాఖానల్లో ఓపీడీ సేవలకు అనుమతిచ్చింది.
మహారాష్ట్రలో 21 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు పదిశాతానికంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జూన్ 1 తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం లేదని ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలను సడలించనున్నట్టు చెప్పారు. ఒకేసారి అన్ని చోట్లా ఆంక్షలను ఎత్తివేయడం సరికాదని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.
దేశరాజధాని ఢిల్లీలో ఈ నెల 31వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. కేసుల తగ్గుదల కొనసాగితే జూన్ 1 నుంచి దశలవారీగా అన్లాక్ ప్రక్రియ చేపడుతామని పేర్కొన్నారు.
కర్ణాటకలో జూన్ 7 వరకు లాక్డౌన్ను పొడిగించారు.
గుజరాత్లో కరోనా కేసుల తగ్గుదల నేపథ్యంలో రాత్రికర్ఫ్యూ సమయాన్ని గంట తగ్గించారు.
కేరళ, తమిళనాడు, మిజోరం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏపీ, జమ్ముకశ్మీర్లలో ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ లేదా ఆంక్షలు కొనసాగనున్నాయి.