శ్రీనగర్ : సరైన సమయంలో జమ్మూకశ్మీర్లకు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. బసోలిలోని రాంలీలా మైదాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని మోదీ జోక్యంతో నాలుగు దశాబ్దాల నాటి షాపూర్ కంది ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. నిన్నటి వరకు బీజేపీని హేళన చేసిన ఇతర పార్టీల నేతలు నేడు ఆ పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారని అన్నారు.
మోదీ ప్రభుత్వాన్ని, నిర్ణయాలను ప్రజలు విశ్వసిస్తున్నారని, ఇది బలమైన.. నమ్మకమైన నాయకత్వాన్ని చూపుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలు కాంట్రాక్టర్లను నిర్ణయించేవారని, యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల మధ్య ఉన్న అనుబంధాన్ని మంత్రి బయటపెట్టారు. మోదీ ప్రభుత్వంలో బంధువులను కాంట్రాక్టర్లుగా మార్చే సంస్కృతి నుంచి కాపాడామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుసార్లు ఎంపీలు తమ సోదరులను కాంట్రాక్టర్లుగా మార్చారని ఆరోపించారు.