న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ తిరిగి చేపట్టాలనే డిమాండ్ ఆ పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలని కోరుతూ పలు రాష్ట్రాలు తీర్మానాలను ఆమోదిస్తున్నాయి. పార్టీ చీఫ్గా రాహుల్ తిరిగి కీలక బాధ్యతలు చేపట్టాలని తొలుత రాజస్ధాన్ కాంగ్రెస్ కమిటీ కోరగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్కు అప్పగించాలని కోరుతూ ఏడు రాష్ట్రాల పార్టీ శాఖలు ఇప్పటివరకూ తీర్మానాలను ఆమోదించాయి.
2017లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేముందు పార్టీ రాష్ట్ర శాఖలు ఈ తరహా తీర్మానాలను ఆమోదించాయి. సెప్టెంబర్ 18న చత్తీస్ఘఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షునిగా చేయాలని కోరుతూ తీర్మానం చేయగా, గుజరాత్ పార్టీ రాష్ట్ర శాఖ కూడా యువ నేత రాహుల్ గాంధీ దేశ యువత ఆకాంక్షలకు ప్రతిరూపమని, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని తీర్మానించింది.
ఇక తమిళనాడు, బిహార్ కాంగ్రెస్ కమిటీలు కూడా తమ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని బలపరుస్తూ తీర్మానాలు చేశాయి. ఇక సోమవారం మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ పార్టీ శాఖలు కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ వైపు మొగ్గుచూపుతూ తీర్మానించాయి. కాగా, అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.