Antibiotics | న్యూఢిల్లీ, జనవరి 18: దేశంలో యాంటి బయాటిక్స్ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) లేకుండా ఇకపై ఎవరికీ యాంటిబయాటిక్స్ ఇవ్వొద్దని ఫార్మాసిస్ట్ అసోసియేషన్లకు కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఫార్మాసిస్టులకు ‘అత్యవసర అభ్యర్థన’ పేరుతో లేఖ రాసింది. అందులో అర్హత ఉన్న వైద్యుల సిఫార్సు మేరకే యాంటిబయాటిక్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. షెడ్యూల్ హెచ్, హెచ్1 నిబంధనలు పాటించాలని, సరైన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటిబయాటిక్స్ అమ్మాలని తేల్చి చెప్పింది. ఎందుకోసం యాంటిబయాటిక్స్ వాడుతున్నారన్నదీ మందుల చీటీపై వైద్యులు పేర్కొనాలని స్పష్టంచేసింది.
దేశంలో యాంటిబయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ చిన్న రోగానికైనా యాంటిబయాటిక్స్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. చిన్న పిల్లలకు కూడా ఇష్టారాజ్యంగా అందిస్తున్నారు. దీనివల్ల రోగకారక క్రిములు యాంటిబయాటిక్స్ను తట్టుకొనే శక్తిని పెంపొందించుకొంటున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. అంటే.. రాబోయే కాలంలో యాంటిబయాటిక్స్ పని చేయకుండా పోతాయి. ఇప్పటికే చాలామందికి యాంటిబయాటిక్స్ పనిచేయటం లేదు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన డీజీహెచ్ఎస్.. అందరు ఫార్మాసిస్టులకు లేఖ రాసి, యాంటిబయాటిక్స్ వాడకంపై కఠిన నిబంధనలు జారీ చేసింది.