టోక్యో: జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే అంత్యక్రియలు ఈ నెల 27న జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నుంచి వేలమంది హాజరుకానున్నారు. షింజో అబే జూలై 8న నారా నగరంలో ఓ ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనపై కాల్పులు జరిపి చంపేశారు.
జపాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన ప్రకారం.. ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు అబే అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ టోక్యోలోని నిప్పన్ బుడోకాన్లో ఆయనకు అంతిమ సంస్కారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 217కు పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న రెండో ప్రధాని షింజో అబే. అంతకుముందు 1967లో మాజీ ప్రధాని శిగేరు యోషిడాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, అబే అంత్యక్రియలకు భారత్ తరఫున ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు.