చెన్నై, అక్టోబర్ 4: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ కాకుండా 12వ తరగతి మార్కులనే ప్రాతిపదికగా తీసుకోవాలన్న తమ ప్రతిపాదనకు మద్దతునివ్వాలని కోరుతూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న 11 రాష్ర్టాలు, గోవా సీఎంకు లేఖ రాశారు. విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై రాజ్యాంగం రాష్ర్టాలకు కల్పించిన అధికారాన్ని పునరుద్ధరించడంలో సహకరించాలని కోరారు. స్టాలిన్ ఈ నెల 1న లేఖ రాయగా సోమవారం అందుబాటులోకి వచ్చింది. నీట్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. రాష్ర్టాలు తమ రాజ్యాంగపరమైన హక్కును గుర్తించి, విద్యాసంస్థల అడ్మిషన్లలో సొంత పద్ధతిని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్తో కేంద్రం తన అధికార పరిధిని దాటి, రాష్ర్టాల అధికారాల్లో జోక్యం చేసుకొంటున్నదని ఆరోపించారు.