చెన్నై/కోల్కత: తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో తొలి విడతగా 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం(ఏప్రిల్ 23) పోలింగ్ జరుగనున్నది. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఇక ఓటర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. పశ్చిమ బెంగాల్లో తొలి దశలో పోలింగ్ జరగనున్న 152 స్థానాలు ఉత్తర, దక్షిణ బెంగాల్లోని కీలక జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక తమిళనాడులో ఒకే దశలో పోలింగ్ పూర్తి కానున్నది.
తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరిగింది. సంప్రదాయంగా జరిగే ముఖాముఖీ పోటీకి బదులుగా ఇప్పుడు ముక్కోణపు పోటీ ఏర్పడింది. డీఎంకే నేతృత్వంలోని అధికార సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(ఎస్పీఏ) రెండవ పర్యాయం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ద్రవిడియన్ మోడల్ పాలనపై తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. ఈ కూటమిలో డీఎంకేతోపాటు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే ఉన్నాయి. ఇక ఏఐఏడీఎంకే నేతృత్వంలో బీజేపీతో కలసి ఎన్డీఏ కూటమి తలపడుతున్నది. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి, శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. ఇక మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే రెండు ప్రధాన కూటములకు గట్టి పోటీని ఇస్తున్నది.
2011 నుంచి అప్రతిహతంగా మూడుసార్లు విజయాన్ని సాధించి నాలుగోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పోరాడుతుండగా ఈసారి ఎలాగైనా మమత ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. అధికార టీఎంసీ ప్రచారం మమత జనాకర్షణ శక్తిపైనే పూర్తిగా ఆధారపడగా బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు బెంగాల్లో మోహరించి ప్రచారం సాగించారు.