న్యూఢిల్లీ, మే 26 : ప్రధాని మోదీ పాలనలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పరీక్షలు బాగా రాయాలని కాకుండా, పరీక్ష పేపరు లీక్ కాకుండా, పరీక్ష రద్దు కాకుండా చూడు దేవుడా అని కోరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలలు, సంవత్సరాల పాటు పోటీ పరీక్షలకు, సాధారణ పరీక్షలకు సిద్ధమై రాస్తున్న విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో పలు ఉద్యోగ నియామక పరీక్షలు, మొన్న నీట్ పేపర్లు లీకై రద్దు కాగా, ప్రస్తుతం అభ్యర్థులు కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి కూడా కల్పించ లేని దీన స్థితి నెలకొంది. సోమవారం యూపీ, బీహార్లలో కానిస్టేబుళ్ల నియామకం కోసం జరిగిన ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీక్ కారణంగానే పరీక్షను రద్దు చేశారని ప్రచారం జరిగింది. ఉన్న సీటింగ్ సామర్థ్యానికి మించి అభ్యర్థులను సెంటర్కు కేటాయించిన కారణంగా ప్రయాగ్రాజ్, కాన్పూర్, లక్నో, గోరఖ్పూర్, ముజఫర్పూర్లలో పరీక్షలు రద్దు చేశామని, కొత్తపరీక్ష తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు. కాగా, పరీక్ష సెంటర్లో తమకు కూర్చోడానికి సీట్లు కూడా కల్పించలేని అధికారుల తీరుపై అభ్యర్థులు పలు చోట్ల ఆగ్రహంతో పరీక్ష హాల్లోని కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సీపీయూలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.
అవ్యవస్థ, అధిక సంఖ్యలో అభ్యర్థుల హాజరు కారణంగానే ఎస్ఎస్సీ జీడీ ఉద్యోగ నియామక పరీక్ష రద్దయిందని ఎస్ఎస్సీ చైర్మన్ ఎస్ గోపాల్కృష్ణన్ తెలిపారు. పేపర్ లీక్ కారణంగానే పరీక్షను రద్దు చేశారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు. అయితే పరీక్ష సెంటర్లో పేపర్ల హ్యాక్కు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ అనుమానంతోనే పలు కంప్యూటర్లు షట్డౌన్ చేశామని, కొన్ని సెంటర్లు మూసివేశామని, దీంతో విద్యార్థులకు కంప్యూటర్లు సరిపోలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు ప్రతిరోజు మూడు షిఫ్ట్లలో జరిగే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 46 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు.
ప్రధాని మోదీ హయాంలో పరీక్షా విధానాలలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్, సీబీఎస్ఈ తర్వాత ఇప్పుడు ఎస్ఎస్సీ జీడీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు వార్తలు రావడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదేం ప్రభుత్వం? ఒక్క పరీక్ష పేపర్ను కూడా సరిగ్గా నిర్వహించలేరా? అని ధ్వజమెత్తారు.