అలహాబాద్: ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చే నెల 11న వెలువడబోతున్నది. దీంతో అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తున్నది. శ్రీకృష్ణుని జన్మ స్థలంలో 13.37 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన దేవాలయాన్ని మొఘలు చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి, మసీదును నిర్మించాడని హిందూ పక్షం వాదిస్తున్నది. హైకోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాల్లో, ఈద్గా మసీదు సముదాయంలో ప్రాథమిక సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల బృందం సర్వే చేయాలని ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సర్వేను నిలిపేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.