ఆర్థిక క్రమశిక్షణలేని శ్రీలంకను కళ్లెం తెంచుకొన్న నిత్యావసరాల ధరలు అతలాకుతలం చేస్తున్నాయి. పెరిగిన ఖర్చులకు జీతం డబ్బులు సరిపోక.. ఉద్యోగమయ్యాక ఆటో నడుపుతున్న ఇంజినీర్లు, సీఏలు ప్రస్తుతం అక్కడి ప్రతి వీధుల్లో కనిపిస్తున్నారు. పెట్రోల్ కోసం కిలోమీటరు మేర క్యూలో గంటల తరబడి నిలబడి ముగ్గురు వృద్ధులు మరణించిన ఘటనలు కలిచివేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన 1948 నాటి నుంచి ఎన్నడూ లేనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోయింది.
– నేషనల్ డెస్క్
కిలో చికెన్ వెయ్యి, కోడిగుడ్డు రూ. 35, కప్పు టీ రూ.100, 3 వేలు పెడితేగానీ గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి ప్రస్తుతం లంకలో నెలకొన్నది. ప్రింటింగ్ కాగితాల కొరత వల్ల లక్షలాది స్కూలు విద్యార్థుల పరీక్షలను రద్దు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర వినియోగదారులు క్యూ లైన్లో నిలబడుతున్నారు. వాళ్లను అదుపుచేయడానికి ప్రభుత్వం బంకుల ముందు సైన్యాన్ని మోహరించింది. విద్యుత్తు నిల్వలు అడుగంటుతుండటంతో రోజూ ఏడెనిమిది గంటల విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి.
ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలను తట్టుకోలేని పౌరులు.. వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తున్నారు. మరికొందరు బతుకుతెరువు కోసం కుటుంబంతో సహా సరిహద్దు దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. అలా జఫ్నా, కోకుపడయాన్ నుంచి భారత్లోకి వచ్చిన ఆరుగురు లంకేయులను భారత తీరప్రాంత గస్తీ దళం మంగళవారం రామేశ్వరంలో పట్టుకొన్నది.
పర్యాటక రంగమే శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు. దేశ జీడీపీలో 10 శాతం వాటా దీనిదే. కరోనాకు ముందు లంక పర్యాటక ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఏటా శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్, పోలండ్, బెలారస్కు చెందినవారే. యుద్ధం వల్ల ఇప్పుడు అక్కడి పర్యాటకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో శ్రీలంక ఆదాయానికి మరింతగా గండిపడింది.