న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను తొలగిస్తు వస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, మెటా వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో స్పాటిఫై కూడా చేరింది. ఈ వారంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను స్పాటిఫై టెక్నాలజీ ఎస్ఏ ప్రారంభించనుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గత అక్టోబర్లో సంస్థకు చెందిన గిల్మెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్కాస్ట్ స్టూడియోస్కు చెందిన 38 మంది ఉద్యోగులపై వేటువేసింది. ఈసారి మరికొంత మందిని ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేసిందని సమాచారం. అయితే ఎంతమందిని తొలగించనుందనే విషయంపై స్పష్టతరావాల్సి ఉంది. స్పాటిఫైలో 9800 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
కాగా, గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు గత శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 6 శాతానికి సమానమని కంపెనీ వెల్లడించింది. గూగుల్తోపాటు అమెజాన్.కామ్, మెటా, మైక్రోసాఫ్ట్ కార్ప్ వంటి కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లను నిలిపివేయడంతోపాటు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో గతేడాది నుంచే మొదలైన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొత్తేడాదిలోనూ కొనసాగుతోంది. 2023లో మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 24 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.