MK Stalin | కోయంబత్తూరులో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. సోషల్ మీడియా వేదిక `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` వేదికగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీఆర్బీ రాజా ఈ విషయమై సీఎం స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు. క్రీడలు, క్రికెట్ ఔత్సాహికుడిగా డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో మరో హామీ జత పరుస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. కోయంబత్తూరులో అత్యాధునిక స్టేడియం ఏర్పాటు కృషి చేస్తామన్నారు.
మంత్రి టీఆర్బీ రాజా విజ్ఞప్తికి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభను ప్రోత్సహించడానికి తమ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కట్టుబడి ఉన్నారన్నారు. చెన్నైలో ఇప్పటికే ఎంఏ చిదంబరం స్టేడియం ఉంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇవ్వడం ఆసక్తికర పరిణామం.