Delhi airport : ఢిల్లీ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. రెండు విమానాల రెక్కలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన గురువారం ఢిల్లీ ఎయిర్పోర్టులో జరిగింది. స్పైస్జెట్ ఎయిర్క్రాఫ్ట్, ఆకాశ ఎయిర్లైన్స్ విమానాల మధ్య ఈ ఘటన జరిగింది. స్పైస్జెట్ సంస్థకు చెందిన బీ737-700 విమానం టేకాఫ్ అయ్యేందుకు కదులుతుండగా, పక్కనే నిలిచి ఉంచిన ఆకాశ ఎయిర్లైన్స్ విమానాన్ని తాకుతూ వెళ్లింది.
ఈ ఘటనలో స్పైస్జెట్ విమానం కుడి రెక్క.. ఆకాశ ఎయిర్లైన్స్ విమానపు ఎడమ రెక్కను తాకింది. దీంతో రెండు విమానాల రెక్కలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో రెండు విమానాల్లోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రెండు విమానాల్ని అధికారులు నిలిపివేశారు. ప్రయాణికుల్ని విమానం నుంచి దింపివేశారు. ఈ ఘటనలో తమ క్యూపీ 1406 అనే విమానం దెబ్బతిందని, ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానం నిలిపి ఉందని ఆకాశ సంస్థ తెలిపింది. ఈ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారని, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని విమానయాన సంస్థల ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఆకాశ ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. ఈ ఘటనపై స్పైస్జెట్ సంస్థ కూడా స్పందించింది. తమ సంస్థకు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైందని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రెండు సంస్థలు ప్రకటించాయి.