న్యూఢిల్లీ: భారత ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వివిధ విభాగాల్లోని ఉద్యోగులు తమకు మే, జూన్, జూలై, ఆగస్టు నెలల జీతాలు ఇంకా చెల్లించలేదని సీఎన్బీసీ-టీవీ18తో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఇలా జీతాలు చెల్లించకపోవడం ఇది నాలుగోసారి అని ఢిల్లీ విమానాశ్రయంలోని గ్రౌండ్ సిబ్బంది ఒకరు తెలిపారు.
సంస్థ ఆర్థిక ఇబ్బందులు విమానయాన సేవలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని ఆఖరి నిమిషంలో రద్దయ్యాయి. ప్రస్తుతం 11 విమానాలు మాత్రమే ప్రయాణ సేవలు అందిస్తున్నాయి. మరోవైపు ఇంధన సరఫరాదారులకు స్పైస్జెట్ సరిగా చెల్లింపులు జరపడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో విమానాల్లో ఇంధనం నింపడానికి ముందే చెల్లింపులు జరపాలని సరఫరాదారులు కోరుతున్నారు.