భోపాల్: నవరాత్రుల సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గా అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న గుంపుపైకి ఒక కారు వెనుక నుంచి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక యువకుడితోపాటు ముగ్గురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో శనివారం అర్ధ రాత్రి ఈ ఘటన జరిగింది. ఇండోర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక వ్యక్తి తినేందుకు భోపాల్ రైల్వే స్టేషన్ వద్ద కారును ఆపాడు. అనంతరం కారును రివర్స్ చేయగా అది ఒకర్ని ఢీకొట్టింది. అతడు ఆ కారుపై దాడి చేయబోగా తప్పించుకునేందుకు డ్రైవర్ వేగంగా రివర్స్ గేర్లో కారును నడిపాడు. దీంతో వెనుక ఉన్న నిమజ్జనానికి వెళ్తున్న గుంపుపైకి అది దూసుకెళ్లింది.
అప్రమత్తమైన పలువురు తృటిలో పక్కకు తప్పుకున్నారు. అయితే 16 ఏండ్ల బాలుడ్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్తోపాటు మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు.
మరోవైపు కారు డ్రైవర్ను అరెస్ట్ చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారును కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో లేడని, రక్త పరీక్ష ద్వారా దీనిని నిర్ధారించినట్లు భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీ వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.