Indian Railways | న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలో రైళ్ల సమయపాలన నానాటికీ దిగజారుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు మధ్య నాటికి మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయపాలన 73 శాతానికి పడిపోయింది. ఇది నిరుడు ఇదే సమయం నాటికంటే దాదాపు 11 శాతం తక్కువ. అంటే.. ప్రస్తుతం ప్రతి నాలుగు రైళ్లలో ఒకటి ఆలస్యంగా నడుస్తున్నట్టే. ఇదే సమయంలో సరుకు రవాణా రైళ్ల వేగం కూడా గంటకు 32.4 నుంచి 27.5 కిలోమీటర్లకు తగ్గింది. అయినప్పటికీ మొత్తం సరుకుల లోడింగ్ స్వల్పంగా 1 శాతం పెరిగి 558 మిలియన్ టన్నులకు చేరడం గమనార్హం.
ట్రాకుల మెయింటెనెన్స్కు అధిక ప్రాధాన్యమివ్వడం, ఇతర నిర్వహణ పనులకు అవసరమైనంత సమయాన్ని కేటాయించడమే ఈ పరిస్థితికి కారణమని రైల్వే అధికారులు చెప్తున్నారు. రైల్వే నెట్వర్క్లో ఎలాంటి పనులు చేపట్టేందుకైనా తగినంత సమయాన్ని కేటాయించడంలో రాజీపడే ప్రసక్తే లేదని, భద్రత, ఆస్తుల నిర్వహణపై దృష్టిసారించడంతోపాటు స్టాప్ సిగ్నళ్లకు సంబంధించిన నిబంధనలను పాటించేందుకు కూడా గట్టిగా కట్టుబడి ఉన్నామని ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ నిర్మాణ ప్రాజెక్టులతోపాటు ఆస్తుల నిర్వహణకు సంబంధించిన వైఫల్యాలు, పెరిగిన రైళ్ల పరిమాణం తదితర అంశాలే గత నాలుగున్నర నెలలుగా మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయపాలన దిగజారడానికి ప్రధాన కారణమని చెప్పారు.