ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 9 వరకు పొడిగించింది. అలాగే ఆయనను ఎన్ఐఏ కస్టడీలోనే విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దర్యాప్తు సమయం కోసం ఎన్ఐఏతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసుతోపాటు వాహనం యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్ వాజేను ఎన్ఐఏ అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నది. ఇప్పటికే ఆయన కస్టడీని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పలు మార్లు పొడిగించింది. తాజా కస్టడీ గడువు బుధవారంతో ముగియడంతో వాజేను ఐఎన్ఏ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన కస్టడీ పొడిగింపును కోరారు.
మరోవైపు ఎన్ఐఏ డిమాండ్ను వాజే తిరస్కరించడంలేదని ఆయన తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐకి కూడా సహకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే సీఎస్ఎంటీ స్టేషన్కు వాజేను సంకెళ్లతో తీసుకెళ్లడంపై న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపు వాదనలు విన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు, సచిన్ వాజే కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది.