Indian Students | న్యూఢిల్లీ, ఆగస్టు 16: మనదేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా భారత విద్యార్థుల కోసం అమెరికా కొత్త కోర్సులను ప్రారంభించనుంది. భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలలో ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్తో ఒక ఏడాది వ్యవధి ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ చేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ (స్టెమ్) విభాగాలలో ఉండే ఈ కోర్సు సెమిస్టర్ 2024లో ప్రారంభమవుతుంది.
ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పని అనుభవం పొందడానికి, రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రస్తుతం అమలులో ఉన్న వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో మూడేండ్ల పాటు ఉండవచ్చు. ఈ కోర్సు గురించి ఇప్పటికే 20 అమెరికా, 15 భారత యూనివర్సిటీలు పరస్పరం చర్చలు జరిపాయి.