లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎస్పీ నేత మహ్మద్ ఆజం ఖాన్ సీతాపూర్ జైలు నుంచి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆజం ఖాన్ జైలు నుంచి తన రాంపూర్ సదర్ స్ధానానికి నామినేషన్ పత్రాలను సమర్పించారని ఆయన చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్ ఆసిం రజా ధ్రువీకరించారు. భూ కబ్జా సహా పలు ఆరోపణలపై ఆజం ఖాన్ 2020 ఫిబ్రవరి నుంచి సీతాపూర్ జైలులో ఉంటున్నారు. ఆజం ఖాన్ నామినేషన్ను తాను ఇవాళ దాఖలు చేశానని, అన్ని లాంఛనాలను పూర్తి చేశానని, ఆయనను బెయిల్పై బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆసిం రజా గురువారం పేర్కొన్నారు.
రాంపూర్ కోర్టు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆజం ఖాన్ నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు రాంపూర్ రిటర్నింగ్ ఆఫీసర్ బుధవారం సీతాపూర్ జైలుకు వెళ్లారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో పిబ్రవరి 14న రాంపూర్లో ఎన్నికలు జరగనున్నాయి. రాంపూర్ స్ధానానికి ఆజం ఖాన్ను ఎస్పీని బరిలో దింపగా అది జెయిల్..బెయిల్ పార్టీ అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్పై కాషాయ పార్టీ విమర్శలు గుప్పించింది.
ఆజం ఖాన్కు కోర్టు బెయిల్ నిరాకరించినా ఆయనకు పార్టీ టికెట్ కట్టబెట్టారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీరును బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా తప్పుపట్టారు. ఎస్పీ హయాంలో రాష్ట్రంలో క్రైం రేటు అత్యధికంగా ఉందని, అప్పట్లో మధురలో జరిగిన జవహర్ బాగ్ ఘటనను ఎవరూ మరిచిపోరని అన్నారు. ఎస్పీలో నేరగాళ్లు అదికమని, మాఫియా డాన్లు తాము చట్టానికి అతీతులమని భావిస్తుంటారని అన్నారు. యోగి హయాంలో వీరందరూ ఇప్పుడు భయంతో కాలం వెళ్లదీస్తున్నారని భాటియా వివరించారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో మార్చి ఏడు వరకూ యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.