లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంతో పొత్తు అవకాశాలను సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. ఎస్పీ ఇప్పటికే పొత్తులను ఖరారు చేసిందని, మరికొన్ని చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఏఐఎంఐఎంతో తాము జట్టుకట్టబోమని అఖిలేష్ ఓ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై అఖిలేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కుటుంబం లేని వారికి ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ గురించి తెలియదని ఎద్దేవా చేశారు. కొవిడ్-19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన పేద కార్మిక కుటుంబాలకు రూ లక్ష చొప్పున తమ పార్టీ అందచేసిందని అఖిలేష్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కాషాయ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. పేదల సంక్షేమం, సామాన్యులకు భద్రత కల్పించడంలో యోగి సర్కార్ దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు. 403 స్ధానాలు కలిగిన యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.