తిరువనంతపురం: కేరళలో ఓ ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలిక కోసం స్థానికంగా వెతికిన కుటుంబసభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. దాంతో బాలిక కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. ఓ నిర్మానుష్య ప్రదేశంలో గోనె సంచిలో పెట్టి మూటకట్టి ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం ఆ డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు బాలికపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దాంతో నిందితుడు బాలికపై వేరేచోట అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి పడేసినట్లు అంచనాకు వచ్చారు. ఇంతలో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీస్ టీమ్స్కు అతను పట్టుబడ్డాడు.
ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించిన పోలీసులు.. తమ అధికారిక ట్విటర్ ఖాతాలో బాధిత బాలికకు క్షమాపణలు చెప్పారు. ‘సారీ డాటర్, నిన్ను నీ తల్లిదండ్రులకు ప్రాణాలతో అప్పగించడంలో మేం విఫలమయ్యాం’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మలయాళంలో చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.