రాజస్థాన్ ఉదయ్పూర్ వేదికగా కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించుకోవడానికి ఈ శిబిర్ ఓ అవకాశాన్ని ఇస్తోందని సోనియా అన్నారు.
అదేవిధంగా పార్టీ ముందున్న అనేక సవాళ్లను చర్చించుకోడానికి కూడా ఇదో అవకాశమని సోనియా అన్నారు. ఈ శిబిరం జాతీయ అంశాలను చర్చించడంతో పాటు ఆత్మావలోకనం కోసం కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఇన్ని సంవత్సరాల పాటు నేతలందరికీ పార్టీ ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు నేతలందరూ పార్టీకి ఇవ్వాలని, వారందరూ బాకీ పడ్డారని అన్నారు. కాంగ్రెస్పై దేశ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చాలని సూచించారు.
దేశ సంక్షేమం కోసం పార్టీ ఎంతో పనిచేసిందని, అలాంటిది… బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల పార్టీ ఎంతో ఇబ్బందులు పడుతోందన్నారు. పార్టీని పూర్తిగా రిపేర్ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని సోనియా అంగీకరించారు. పార్టీని రిపేర్ చేసి, మెరుగైన పనితీరును కనబరచాలని సోనియా సూచించారు.
ఈ సందర్భంగా బీజేపీ, ఆరెస్సెస్పై సోనియా గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో మైనారిటీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి శాంతి కరువైందని ఆరోపించారు. దేశాన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పట్టి పీడిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ మైనారిటీల్లో భయాందోళనలను రేపుతోందని, ఓట్లను పోలరైజ్ చేస్తూ, లేనిపోని భయాందోళనలు రేపుతోందని సోనియా మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వం మాక్సిమమ్ గవర్నెన్స్- మినిమమ్ గవర్నమెంట్ అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుందని సోనియా గుర్తు చేశారు. దీనర్థం.. దేశంలో పోలరైజేషన్ రాజకీయాలు చేయడం, ప్రజలను భయాందోళనలో ఉంచడమేనని విరుచుకుపడ్డారు. ఈ దేశంలో భాగమైపోయిన మైనారిటీలను భయపెట్టడమే దీనర్థమని సోనియా నిర్వచించారు.