Sonia Gandhi | ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపం చినికి చినికి గాలి వానగా మారుతోంది. ఈ విషయంపై అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంపై పూర్తి దృష్టి సారించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం సాయంత్రం పంజాబ్ సీఎం చెన్నీకి ఫోన్ చేశారు. పంజాబ్ వేదికగా జరిగిన ఘటనపై ఆయనతో సోనియా క్షుణ్ణంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశ ప్రధాని భద్రత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలని, వెనకాడకూడదని సోనియా సీఎం చెన్నీకి సూచించారు. ప్రధాని అంటే మొత్తం దేశానికి చెందిన వారని, ఆయన బందోబస్తులో ఎలాంటి అలసత్వం కూడదని సోనియా పేర్కొన్నట్లు సమాచారం. అయితే జరిగిన ఘటన, దాని తర్వాతి పర్యవసానాలతో సహా మొత్తం వ్యవహారాన్ని పంజాబ్ సీఎం చెన్నీ అధ్యక్షురాలు సోనియాకు వివరించినట్లు తెలుస్తోంది.