న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బుధవారం లేఖ రాశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నించేందుకు మరింత గడువు కోరారు. కరోనా సోకడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ ఇంచార్జీగా కొత్తగా నియమితులైన జైరామ్ రమేష్, ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్ చేశారు. ‘కరోనా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సోనియాను ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో పూర్తిగా కోలుకునే వరకు హాజరును కొన్ని వారాలు వాయిదా వేయాలని కోరుతూ ఈ రోజు ఈడీకి ఆమె లేఖ రాశారు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నించేందుకు ఈ నెల 8న తమ కార్యాలయానికి రావాలంటూ ఈడీ తొలుత సమన్లు జారీ చేసింది. అయితే జూన్ 2న సోనియాకు కరోనా సోకడం, అనంతరం ఆసుపత్రిలో చేరడంతో ఆమె గైర్హాజరయ్యారు. తన అనారోగ్యం వల్ల రాలేకపోతున్నట్లు పేర్కొన్న సోనియా గాంధీ ఈడీని గడువు కోరుతూ తొలుత లేఖ రాశారు. దీంతో ఈ నెల 23న (గురువారం) హాజరు కావాలంటూ ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. అయితే దీనికి ఒక రోజు ముందు సోనియా మరోసారి గడువు కోరుతూ ఈడీకి లేఖ రాశారు. మరోవైపు సోనియా కుమారుడు రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజులపాటు సుమారు 50 గంటల వరకు ప్రశ్నించింది.