Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పొరపాటు ఒప్పుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరిందర్ సింగ్ను వెనుకేసుకొచ్చానని ఆమె అన్నట్లు తెలిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై ఆదివారం దాదాపు ఐదు గంటలు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో అమరిందర్ సింగ్ పట్ల తన వైఖరి పొరపాటేనని సోనియా అంగీకరించినట్లు సమాచారం.
పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గతంగా అమరిందర్ సింగ్పై అసమ్మతి పెరిగిపోయినా.. కెప్టెన్ను వెనుకేసుకొచ్చానని సోనియా అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది చివర్లో అమరిందర్ సింగ్ను సీఎంగా తొలగించిన తీరు.. టైమింగ్పై అధి నాయకత్వాన్ని సమావేశంలో పాల్గొన్న ఓ సీనియర్ నేత ప్రశ్నించినట్లు తెలిసింది. సుదీర్ఘ కాలం కెప్టెన్ను సోనియా వెనకేసుకు వచ్చారని కూడా అన్నట్లు సమాచారం.
దీనిపై జోక్యం చేసుకున్న సోనియా.. అంతకుముందే కెప్టెన్ను సీఎంగా తప్పించాల్సిందని.. పూర్తిగా దెబ్బ తిన్న తర్వాత నిర్ణయం తీసుకోవడం సరి కాదని అన్నట్లు సమాచారం. సీఎంగా కెప్టెన్ను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం తన తప్పేనని ఆమె అన్నారని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు చెప్పారు.