న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దాదాపు 25 ఏండ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె పెద్దలసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. గుజరాత్ నుంచి ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల తరఫున ఖాళీ అయిన 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికయ్యారు. మిగిలిన చోట్ల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నిక జరుగనున్నది.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఇటీవలే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురగన్ తదితరులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లోని ఖాళీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు.
అత్యధికంగా బీజేపీ 20 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ 4, వైఎస్సార్ కాంగ్రెస్ 3, ఆర్జేడీ 2, బీజేడీ 2, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీ(యూ) చెరొక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. 41 స్థానాల్లో ఇతర అభ్యర్థులెవరూ పోటీ లేకపోవటంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక రిటర్నింగ్ అధికారులు వారిని విజేతలుగా ప్రకటించారు. 56 ఖాళీలకు గాను 50 చోట్ల సభ్యులు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనుండగా.. మరో ఆరుగురు ఏప్రిల్ 3న పదవీ విరమణ చేయనున్నారు. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్లో ఒక స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉన్నది.