Sonia Gandhi | అసమ్మతి నేతల డిమాండ్లకు కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గినట్లు తెలుస్తున్నది. శుక్రవారం జీ-23గా పేరొందిన అసమ్మతి నేతలకు సారధ్యం వహిస్తున్న గులాంనబీ ఆజాద్ చేసిన ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమ్మతి వ్యక్తం చేశారని సమాచారం. శుక్రవారం ఆజాద్తో సోనియాగాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. త్వరలో ఏఐసీసీ నుంచి పీసీసీల వరకు పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆమె నిర్ణయించారని సమాచారం. ఆజాద్తో జరిపిన చర్చల్లో వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిసింది.
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా గులాం నబీ ఆజాద్ను నియమించనున్నట్లు వినికిడి. అదే రాష్ట్రం నుంచి ఆజాద్ను రాజ్యసభకు పంపాలని సోనియాగాంధీ నిర్ణయించారని సమాచారం. మరో అసమ్మతి నేత ఆనంద శర్మకు రాజ్యసభ సభ్యత్వం కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తున్నది. లోక్సభ సభ్యుడు మనీశ్ తివారీకి ఏఐసీసీలో బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు.
ఇక హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడాను హర్యానా పీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి అంగీకరించారని తెలిసింది. ప్రస్తుతం హర్యానా పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న కుమారి షెల్జా పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఇక గాంధీ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరో సీనియర్ నేత కపిల్ సిబాల్ పట్ల సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఆయనకు బాధ్యతలు అప్పగించే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది.