న్యూఢిల్లీ/శ్రీనగర్: హిమాలయ ప్రాంతమైన లడఖ్కు స్వయం ప్రతిపత్తి కోరుతూ ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహారదీక్ష శనివారం నాటికి 18వ రోజుకు చేరుకున్నది. ఇప్పటికే ఎంతో బలహీనంగా ఉన్నా, దీక్షను విరమించమని సన్నిహతులు కోరుతున్నా.. మరో మూడు రోజుల పాటు దీక్షను కొనసాగించాలని వాంగ్చుక్ నిర్ణయించుకున్నారు. ఆయన దీక్షకు వేలాది మంది నుంచి మద్దతు లభిస్తున్నది. పారిశ్రామికీకరణ వల్ల లడఖ్ ప్రాంతంలోని హిమానీనదాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదన్న అంశాన్ని వాంగ్చుక్ దీక్ష బలంగా బయటపెట్టింది. 21 రోజుల అనంతరం తాను దీక్ష విరమించినా.. తన మద్దతుదారులు వంతులవారీగా నిరాహారదీక్షను కొనసాగిస్తారని వాంగ్చుక్ తెలిపారు. అతడికి మద్దతు తెలపటానికి శనివారం ఒక్కరోజే లేహ్ నగరంలోని దీక్షా స్థలి దగ్గరికి సుమారు 2 వేల మంది ప్రజలు వచ్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో గుర్తించిన రాష్ర్టాల జాబితాలో లడఖ్ను చేరుస్తామని 2019 జాతీయ ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. కానీ అదింకా నెరవేరలేదు. అంతర్జాతీయ మీడియాతో వాంగ్చుక్ మాట్లాడుతూ లడఖ్లో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. పారిశ్రామిక, మైనింగ్ ప్రయోజనాల నుంచి ఇక్కడి నేలను, అడవులను రక్షించే చట్టాలు చేయలేని స్థితి ఉందన్నారు.